
చిత్రపరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో తెలియదు. అలా ఒక్క సక్సెస్ వచ్చిందంటే ఆ తరువాత అవకాశాలు వరుసకడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే స్టార్డమ్ వచ్చేస్తుంది. నటి కయదు లోహర్ పరిస్థితి అంతే. గత ఏడేళ్ల క్రితం మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఈమె. అప్పటి నుంచి మంచి అవకాశాల కోసం పోరాడుతునే ఉంది. కాగా ఏడాది క్రితం తన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్తో డ్రాగన్ చిత్రంలో నటించే లక్కీచాన్స్ వరించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో తెరపై వచ్చిన డ్రాగన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అంత పెద్ద హిట్టు అవుతుందని, తనకు క్రేజ్ తెచ్చిపెడుతుందని బహుశా కయదు లోహర్ కూడా ఊహించి ఉండదు.
అంతే ఇప్పుడు కోలీవుడ్లోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా ఈమెను గుర్తించింది. అవకాశాలను అందిస్తోంది. నాని సినిమా "ది ప్యారడైజ్"లో కయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అధికారికంగా ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆపై కోలీవుడ్లో నటుడు అధర్వకు జంటగా హృదయం మురళి చిత్రంలో నటిస్తోంది. తాజాగా శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది.
అంతేకాదు సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్కుమార్తో జతకట్టే లక్కీచాన్స్ వరించింది. ఈ చిత్రాన్ని మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించనున్నారు. అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా జీవి ఇంతకుముందు తన 25 చిత్రం కింగ్స్టన్ చిత్రంతో తెరపైకి వచ్చారు. తాజాగా ప్రస్తుతం ఇడిముళక్కం, 13, బ్లాక్మెయిల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత కయాడులోహర్తో జతకట్టే ప్రయత్నం చేస్తారో, వాటితో పాటు ఈ చిత్రాన్ని చేస్తారో తెలియాల్సి ఉంది.