పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. కానీ ఆ ఆశ తీరకముందే తనువు చాలించాడు కళాభవన్ మణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2016 మార్చి 6న మరణించాడు. తండ్రి లేకపోయినా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూతురు శ్రీలక్ష్మి. తనను డాక్టర్గా చూడాలన్న తండ్రి కలను నిజం చేసింది.
తండ్రి కల సాకారం
ఈ విషయాన్ని కళాభవన్ మణి సోదరుడు, డాక్టర్ ఆర్ఎల్వీ. రామకృష్ణన్ వెల్లడించాడు. మణి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెను పేదలకు వైద్యం చేసే డాక్టర్గా చూడాలని మణి ఎన్నో కలలు కన్నాడు. అతడు కోరుకున్నట్లే తను వైద్యురాలయింది. తన కుమార్తెను డాక్టర్ చేయాలని, పేదలకు ఉచిత చికిత్స అందించే ఆస్పత్రి ప్రారంభించాలన్నది మణి ఆశయం.
డాక్టర్ విద్య పూర్తి
ఈ విషయాన్ని తనెప్పుడూ బయటకు చెప్తూ ఉండేవాడు. తండ్రి మరణించిన బాధలోనే శ్రీలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా తనకు మంచి మార్కులొచ్చాయి. కాలేజీలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. డాక్టర్ కోర్సులో చేరేందుకు రెండేళ్ల శిక్షణ తీసుకుంది. అలా MBBSలో సీటు సంపాదించుకుంది. కూతురి కోసం నిమ్మి (కళాభవన్ భార్య) కూడా కాలేజీ దగ్గర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది అని పేర్కొన్నాడు.
ఆటో నడిపి సినిమాల్లో..
కళాభవన్ మణి మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. బతుకు బండి ముందుకు సాగడం కోసం ఆటో నడిపాడు. కెప్టెన్ ప్రభాకరన్ అనే తమిళ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేశాడు. 1996లో వచ్చిన సల్లప్పం అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్గా అనేక సినిమాలు చేశాడు. ఆ తర్వాత సహాయక పాత్రలు చేశాడు.
తెలుగు సినిమా
వాసంతియుమ్ లక్ష్మియుం పిన్నె నిజానుం సినిమాలో అంధ సింగర్గా నటించగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సహాయక పాత్రలకే పరిమితం కాకుండా విలన్గా ట్రై చేశాడు. తెలుగులో జెమిని, అర్జున్, ఆయుధం, నరసింహుడు, ఎవడైతే నాకేంటి, నగరం.. ఇలా అనేక సినిమాలు చేశాడు. ప్లే బ్యాక్ సింగర్గానూ టాలెంట్ చూపించాడు. నటుడిగా దాదాపు 200 సినిమాలు చేసిన ఆయన అతిగా మద్యం తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు.
చదవండి: డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన నయనతార దంపతులు


