
పని చేసుకుంటూ పోతే వయసు గుర్తుకు రాదంటారు. అది రజనీకాంత్ విషయంలో అక్షరాల నిజం అవుతోంది. జైలర్ చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న రజినీకాంత్ ఆ తర్వాత వేట్టైయాన్ చిత్రం చేశారు. తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రం పూర్తి చేశారు. ఆ వెంటనే తాజాగా జైలర్ –2 చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కోయంబత్తూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే రజినీకాంత్ జైలర్– 2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్లారు.
జైలర్ చిత్రంలో టైగర్ ముత్తు వేల్ పాండియన్గా నటించిన రజనీకాంత్ సీక్వెల్లోనూ అదే పాత్రలో నటిస్తున్నారు. అందులో ఆయనకు కూతురుగా నటించిన మలయాళ నటి మిర్ణా మోహన్ కూతురుగానే నటిస్తున్నారు. ఇకపోతే జైలర్ చిత్రంలో రజనీకాంత్కు భార్యగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆయనకు జతగా నటిస్తున్నారు. దీని గురించి నటి రమ్యకృష్ణ తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొంటూ జైలర్–2 చిత్ర షూటింగ్లో తాను గత 10వ తేదీ నుంచి పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే తేదీ తాను రజనీకాంత్ కలిసి నటించిన పడయప్ప చిత్రం 26 వసంతాలను పూర్తి చేసుకున్న రోజు అని పేర్కొన్నారు.

జైలర్–2 చిత్రంలో మళ్లీ రజనీకాంత్తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులోకి నటుడు యోగిబాబు, ఎస్జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కోయంబత్తూరు, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఏకదాటిగా 35 రోజులు జరుపుకుంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రోమో ను విడుదల చేసిన విషయం, అది రజనీకాంత్ అభిమానులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే.