హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ఈషా. గతేడాది చివర్లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈషా కథేంటంటే..
కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.


