మూకీ (సంభాషణలు లేని) చిత్రాలతో మొదలైన సినిమా ఆ తర్వాత టాకీ వరకూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడూ అడపా దడపా మూకీ చిత్రాలు వస్తుంటాయి. కానీ చాలా అరుదుగానే. తాజాగా ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ ఫిల్మ్ రూపొందింది. ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఒక్క సంభాషణ కూడా లేకుండా రూపొందిన ఈ టీజర్లో నటీనటుల హావభావాలు అనేక ప్రశ్నలను లేవనెత్తేలా ఉన్నాయి.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ ముఖ్య తారలుగా కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో క్యోరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విభిన్నమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.


