
అభిరామి, షణ్ముగమూర్తి, ఏఆర్ రెహమాన్, మణిరత్నం, కమల్హాసన్, త్రిష, శింబు
‘‘థగ్ లైఫ్’ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్ వంటి నటీనటులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు(త్రిష, అభిరామి) ఉన్నప్పటికీ నాకు ఒక్కసారి కూడా వారు ఐ లవ్ యూ చెప్పలేదు. కానీ, జోజు జార్జ్ మాత్రం రోజూ ఐ లవ్ యూ చెప్పేవారు’’ అని కమల్హాసన్ సరదాగా పేర్కొన్నారు. కమల్హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘థగ్ లైఫ్’.
శింబు, త్రిష, జోజు జార్జ్, అభిరామి ఇతర ప్రధానపాత్రలుపోషించారు. మద్రాస్ టాకీస్, రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్స్పై కమల్హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ నుంచి ‘జింగుచ్చా...’ అంటూ సాగే తొలిపాటని రిలీజ్ చేశారు. ఈపాటకి కమల్హాసన్ సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘నాయగన్’ తర్వాత మళ్లీ మణిరత్నంగారి దర్శకత్వంలో నటించడానికి ప్రేక్షకులే కారణం. ఆయనకు, నాకు మధ్య ఇప్పటికీ ఏమీ మారలేదు. ‘థగ్ లైఫ్’ కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు. మణిరత్నం మాట్లాడుతూ–‘‘కమల్హాసన్ సినిమా లవర్. డబ్బింగ్ జరుగుతుంటే నా ఆఫీస్కు వచ్చిన కమల్హాసన్ అమెరికాలో జరుగుతున్న సౌండ్ మిక్సింగ్ గురించి చెప్పారు. ఆయన దర్శకుడికి 50 శాతం భారాన్ని తగ్గిస్తారు’’ అన్నారు.
త్రిష మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో నేను నటించిన మూడవ చిత్రం ‘థగ్ లైఫ్’. అదేవిధంగా కమల్హాసన్ గారు, శింబుతోనూ నటించిన మూడో చిత్రం ఇది కావడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘కమల్హాసన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని శింబు తెలిపారు. ఈ వేడుకలో నటీనటులు అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, కెమేరామేన్ రవి కె.చంద్రన్ తదితరులుపాల్గొన్నారు. – ‘సాక్షి’ తమిళ సినిమా, చెన్నై