సినీ రంగంలో క్రేజీ కాంబినేషన్పై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొత్త కాంబోకు శ్రీకారం పడనుందా అంటే కోలీవుడ్లో అవుననే సమాధానమే వస్తోంది. కథానాయకుడిగా, దర్శకుడు, నిర్మాతగా బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తనను వెతుక్కుంటూ వస్తున్న మంచి కథలను వదులు కోవడం లేదు.
తాజాగా దర్శకుడు శివ చెప్పిన కథ నచ్చడంతో అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సూర్య కథానాయకుడిగా శివ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన కంగువ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న శివ నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు.
అయితే ఆ చిత్రం ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేక పోవడంతో ధనుష్ తో చిత్రం చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఇటీవల కోలీవుడ్లో చిత్రాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుందని చెప్పవచ్చు.
ఇటీవల అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు శివ దర్శకత్వంలో రూపొందించబోతున్నది యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈచిత్రం కోసం నటుడు ధనుష్ 2027 జనవరి నుంచి కాల్ షీట్స్ కేటాయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం.


