ఇంద్ర గుర్తుగా.. అశ్వనీదత్‌కు కానుక ఇచ్చిన చిరంజీవి | Chiranjeevi Special Gift Sent To Ashwini Dutt For Indra Movie Re Release Success, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

ఇంద్ర గుర్తుగా.. అశ్వనీదత్‌కు కానుక ఇచ్చిన చిరంజీవి

Aug 24 2024 4:44 PM | Updated on Aug 24 2024 5:18 PM

Chiranjeevi Gift Sent To Ashwini Dutt For Indian Success

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఇంద్ర సినిమా రీ-రిలీజ్‌ అయింది. చిరు కెరియర్‌లో ఇంద్ర సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమాను అందించిన నిర్మాత అశ్వనీదత్‌కు చిరంజీవి విలువైన కానుకను అందించారు. ఎన్నో రికార్డ్స్‌ను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో వైజయంతి మూవీస్ రీ-రిలీజ్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజే ఏకంగా రూ.3.05 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఈ సంతోష సమయంలో ఇంద్ర సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులను చిరంజీవి సత్కరించారు.

ఇంద్ర సినిమాలో భాగమైన నిర్మాత అశ్వనీదత్‌, దర్శకుడు బి.గోపాల్‌, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, కథ రచయిత చిన్నికృష్ణలను తన ఇంటికి ఆహ్వానించిన చిరు వారిని సత్కరించారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్‌కు ఒక శంఖాన్ని బహుమతిగా చిరు ఇచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని అశ్వనీదత్‌ తన ఎక్స్‌ పేజీ ద్వారా ఇలా తెలిపారు.  'మీరు ఈ విజయశంఖాన్ని కానుకగా నాకు ఇచ్చారు ... కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం.' అంటూ పేర్కొన్నారు. 

వైజయంతి మూవీస్‌లో మెగాస్టార్‌ ఇప్పటి వరకు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది,ఇంద్ర, జై చిరంజీవ చిత్రాల్లో నటించారు. అయితే, త్వరలో ఐదో చిత్రం కూడా నిర్మిస్తానని అశ్వనీదత్‌ ప్రకటించారు.

2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్‌ అయింది. మొత్తం 268 స్క్రీన్‌లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. 35 కేంద్రాలలో 100 రోజులు, 22 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. చిరు రెమ్యునరేషన్‌ కాకుండా రూ. 7కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement