రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు | Bade Miyan Chote Miyan Four Days Collections | Sakshi
Sakshi News home page

రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు

Apr 15 2024 4:31 PM | Updated on Apr 15 2024 6:02 PM

Bade Miyan Chote Miyan Four Days Collections - Sakshi

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్‌ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది.

సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్‍లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్‌టైన్‍మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే..  భారీ డిజాస్టర్‌ దిశగా కొనసాగుతుంది.

ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్‌ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత  సినిమా బాగాలేదని టాక్‌ రావడంతో రెండో రోజే కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్‌ కాస్త పెరిగాయని ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు  నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్‌ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement