హైదరాబాద్లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.
అల్లు అరవింద్ను టెక్నాలజీ పయనీర్గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.
అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్ఫారమ్ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్ను హైదరాబాద్కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.


