సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమలతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చిత్ర పరిశ్రమకు కావాల్సిన సదుపాయలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, అక్కడ 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
కాగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’లో మంగళవారం సినీ, వినోద రంగాలపై చర్చ ఏర్పాటు చేశారు. ఈ చర్చలో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా, టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.


