లిటిల్ హార్ట్స్, అంజాజీపేట మ్యారేజ్ బ్యాండు, హే బలవంత్ తదితర సినిమాలతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం.. రీసెంట్గా ఊహించని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శనభాగ్యం దక్కిందని కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఐదు సెకన్ల దొరకడమే కష్టమనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై స్వయంగా సదరు హీరోయినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)
'కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి విషయాలు, సినిమా జర్నీ, భక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడాను. నా స్పిరిట్యూల్ జర్నీ గురించి పంచుకున్నా. అందులో తిరుపతి గురించి మాట్లాడాను. 15 నిమిషాల దర్శనం అనే మాట హైలైట్ అవుతోంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. 2025 అక్టోబరులో విమానాశ్రయంలో నేను, మా అమ్మ.. లైనులో నిల్చుని శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాం. తర్వాత దర్శనం చేసుకున్నాం. లైన్లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంతవరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తుంటారు. ఆ మొత్తం సమయం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను తప్పితే పావుగంట పాటు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు'
'సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా రూ.300 టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లాను. అప్పుడు కేవలం 5 సెకన్ల పాటు స్వామిని చూశాను. నా జీవితంలో తొలిసారి 13 ఏళ్ల తర్వాత స్వామిని అంత దగ్గరగా చూశాను. ఇది నేను సంతోషంగా భావించి ఆత్రుతతో ఆ విషయాన్ని పంచుకున్నాను అంతే. అది కొంచెం మిస్ లీడింగ్గా వెళ్తోంది. మీలో ఎవరైనా శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని వెళ్తే స్వామి దర్శనం మీకు కూడా అలానే దక్కుతుంది' అని హీరోయిన్ శివానీ నాగారం వివరణ ఇచ్చింది.
(ఇదీ చదవండి: అన్వేష్కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు)


