బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ ప్రారంభదశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇన్ఫిల్టరేటింగ్ డక్టల్ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్ 1లో ఉంది.
రొమ్ము క్యాన్సర్
ఇప్పుడు మీరిది చదువుతున్నారంటే ఈ వ్యాధి గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పేందుకు ధైర్యం కూడదీసుకున్నట్లే లెక్క! నేను రొటీన్ చెకప్కు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తూ ప్రారంభం దశలోనే గుర్తించగలిగాం. లెక్కలేనన్ని టెస్టులు, శస్త్రచికిత్సలు.. ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తోంది. కానీ మీ ప్రేమాభిమానాలే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాయి.
భయం పటాపంచలు
సర్జరీ తర్వాత అమ్మానాన్న ముఖం చూడగానే నాలో భయం పటాపంచలై కొత్త శక్తి ప్రవహించింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వు స్ట్రాంగ్ లేడీవి.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కెరీర్
రాజశ్రీ దేశ్పాండే తలాష్ (2012) చిత్రంతో బాలీవుడ్లో తన కెరీర్ ఆరంభించింది. కిక్, మామ్, ద స్కై ఈజ్ పింక్, జోరం వంటి చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కుచ్ తో లోగ్ కహేంగే, 24: ఇండియా సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది. సేక్రెడ్ గేమ్స్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్తో విశేషమైన పాపులారిటీ దక్కించుకుంది.


