టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ నేడు(మార్చి 4) హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ విందు కంటే ముందే..తెలుగు మీడియాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సతీమణి రష్మికతో కలిసి మీడియా ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా విజయ్ మట్లాడుతూ.. తన కెరీర్లో మీడియా సహాకారం ఎంతో ఉందన్నారు.‘కెరీర్ ప్రారంభంలో నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది. నన్ను ప్రజల దగ్గరకు చేర్చేలా చేసింది మీడియాను.
నా ప్రతి ఇంటర్వ్యూను తిరిగి చూసుకునేవాడిని. ఎలా మాట్లాడాను? ఇంకా ఎలా మట్లాడాలి?అనేది తెలుసుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి జంటగా మీ దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మనం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. తెలుగు మీడియా అనేది మా సొంత మీడియా. మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ విజయ్ నవ్వులు పూయించాడు.
కాగా, ఇప్పటికే విజయ్-రష్మిక జంట అభిమానుల కోసం ఓ ప్రత్యేక విందును ఇచ్చింది. అలాగే మార్చి 1న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్లు పంపిణీ చేశారు.కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.


