రన్ రాజా రన్, పటాస్, దోచేయ్, రాజుగారి గది, కుమారి 21 ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడు, మజిలీ, సామజవరగమన.. ఇలా అనేక సినిమాలు చేశాడు నటుడు సుదర్శన్. నెల్లూరు యాసలో చెప్పే డైలాగులతోనే అతడు ఫేమస్ అయ్యాడు. ఎక్కువగా హీరో స్నేహితుడు పాత్రల్లో కనిపించాడు. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాలో కనిపించాడు.
చదువు మధ్యలోనే..
తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుదర్శన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్. కానీ బీటెక్ మధ్యలోనే ఆపేశాను. చాలా బిజినెస్లు, పని చేసి చివరకు సినిమాల్లోకి వచ్చాను. మూవీ ఇండస్ట్రీ అనగానే ఇంట్లోవాళ్లు భయపడ్డారు. కానీ, నన్ను వెండితెరపై చూసి సంతోషపడ్డారు.
గోదావరిలో పడిపోయా..
కుమారి 21 ఎఫ్ రిలీజ్కు ముందు ఓ చిన్న సినిమా షూటింగ్ కోసం గోదావరి జిల్లాకెళ్లాను. చిత్రీకరణ సమయంలో నేను గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రాదు. నేను చనిపోయానని అందరికీ ఫోన్లు వెళ్లాయి. లోకల్ మీడియా లొకేషన్కు చేరుకుంది. నానాకష్టాలు పడి నన్ను బయటకు లాగారు.
బతికే ఉన్నా..
నేను బతికే ఉన్నానని తెలుస్తోంది కానీ, కళ్లు తెరవడానికి గంట సేపు పట్టింది. ఈ సంఘటన తర్వాత ఇంట్లోవాళ్లు తిట్టి సినిమాలు వద్దు, ఇంటికి వచ్చేయ్ అన్నారు. నా తొలి మూవీ రన్ రాజా రన్. దీనికి నేను రూ.3500 పారితోషికం అనుకున్నాను. రిలీజైనవి, కానివి కలుపుకుంటే దాదాపు 150 సినిమాలు చేశాను అని సుదర్శన్ చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో..
సుదర్శన్ ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బర్త్డే రోజు నేను, నా స్నేహితుడు హీరో ఇంటికెళ్లాం. ఇంటి గేటు ముందున్న చెట్టు కింద నిల్చున్నాం. ప్రభాస్.. బాహుబలి ప్రీ ప్రొడక్షన్ కోసం కేరళ వెళ్లాడు, లేడని చెప్పినా మేము వినలేదు. అభిమానులు వచ్చి వెళ్లిపోతున్నారు. మేము మాత్రం కదల్లేదు. తిండీ తిప్పలు మానేసి ఉదయంనుంచి అర్ధరాత్రి ఒంటిగంటవరకు ఆ చెట్టు కిందే వర్షంలో తడుచుకుంటూ నిల్చున్నాం. ఇంతలో మమ్మల్ని లోపలకు పిలిచారు. నాతో కేక్ కట్ చేయించి, తినమన్నారు. ప్రభాస్ వచ్చాక ఈ ఫోటోలు చూపిస్తాం.. వెళ్లిపోండి అన్నారు. ప్రభాస్ నిజంగానే లేడని అర్థమైంది. అయినా ఆర్టిస్టులను ఇలా ఇబ్బందిపెట్టడం తప్పని తర్వాత తెలిసొచ్చింది అన్నాడు.


