విషజ్వరాల
నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల బాట పడుతున్నారు. వర్షాకాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, పగటి పూట తీవ్రమైన ఎండలు, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా మారడం వంటి కారణాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 15 రోజులుగా రోజువారీగా 115 నుంచి 150 మంది వరకు విషజ్వరాలతో చికిత్స కోసం వస్తున్నారు. రోగుల్లో 10 నుంచి 15 మంది వరకు ఆస్పత్రిలో ఇన్పేషెంట్లుగా చేరుతుండగా, మిగిలిన వారు అవుట్ పేషెంట్లుగా వైద్యుల సలహాతో మందులు తీసుకుని వెళ్తున్నారు. ఇన్పేషంట్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆస్పత్రిలోని ఫీవర్ వార్డు రోగులతో కిటకిటలాడుతోంది. సరిపడా మందులను అందజేస్తున్నట్లు పలువురు రోగులు తెలిపారు.


