రామాయంపేట(మెదక్): పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సోమవారం మెదక్ వెలుతూ రామాయంపేటలో కొద్దిసేపు ఆగారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు పీసీసీ చీఫ్, మైనంపల్లిని సన్మానించారు. కాగా, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది.
మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి నిర్వహిస్తున్నామని డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై ప్రజల నుంచి 55 అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను పరిశీలిస్తూ సమస్యలను పూర్తిగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.
రామాయంపేట(మెదక్): చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో మంజీరా విద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సబ్ జూనియర్ విభాగంలో అవ్యక్త, బాలుర విభాగంలో లోకేశ్ ప్రథమస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థి శివప్రసాద్ సిల్వర్ మెడల్ సాధించగా, హంసిని, చేతన, దీప్తి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ జితేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ వాసవి, ఉపాధ్యాయులు అభింనందించారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట శివారు పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న రసాయనాలతో కలుషితమైన కుంటను పీసీసీ అధికారులు సోమవారం పరిశీలించారు. సర్పంచ్ సంతోష ఫిర్యాదు మేరకు పీసీబీ ఎన్విరాల్మెట్ అసిస్టెంట్ ఏఈ రవీందర్ రాజారామ్ కుంటను పరిశీలించి శాంపిల్స్ తీసుకెళ్లారు. అనంతరం పరిశ్రమలోనూ తనిఖీలు నిర్వహించారు. రసాయన జలాలను సేకరించారు. ఈసందర్భంగా అధికారి మాట్లాడుతూ.. జలాలను ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. మాజీ ఎంపీటీసీ శివకుమార్, పరిశ్రమ సిబ్బంది ఉన్నారు.
ఎంపీ రఘునందన్రావు
పటాన్చెరు: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు కీలక సమస్యలపై ఎంపీ రఘునందన్రావు హెచ్ఎండీఏ కమిషనర్, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ను సోమవారం కలిసి చర్చించారు. అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించే అంశంపై ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా పటాన్ చెరు ఎగ్జిట్– 3 నుంచి ఎగ్జిట్–4, సుల్తాన్పూర్ మధ్య పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లూరు ఎగ్జిట్–2 వద్ద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.


