కలెక్టర్ ప్రతిమాసింగ్
హవేళిఘణాపూర్(మెదక్): తేనెటీగల పెంపకంపై రైతులు ఆసక్తి చూపితే ఉపాధితో పాటు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మక్తభూపతిపూర్లో రైతు జయపాల్రెడ్డి పొలంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతు సాగు చేసిన డ్రాగెన్ ఫ్రూట్ పంటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. తేనెటీగల పెంపకానికి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుకు 40 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పోశెట్టి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రతాప్సింగ్, డీఏఓ దేవ్కుమార్, రైతులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా టీఫైబర్ నెట్
మెదక్ కలెక్టరేట్: ఈనెలాఖరులోగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ–ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోడల్ ఆఫీసర్ నియమిస్తామన్నారు. సమగ్ర ప్రణాళిక రూ పొందించి త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఫారంపాండ్లతో భూగర్భ జలాల పెంపు
తూప్రాన్: భూగర్భ జలాల పెంపునకు ఫారంపాండ్లు దోహదపడతాయని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు అన్నారు. గురువారం మండలంలోని ఇస్లాంపూర్లో ఉపాధిహామీ పనుల్లో భాగంగా ఫారంపాండ్ల పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో భూగర్భజలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఫారంపాండ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మండలంలో మరిన్ని నిర్మాణాలు చేపట్టి రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏపీఓ సంతోశ్రెడ్డి, టీఏ సత్యం, పంచాయతీ కార్యదర్శి కల్పన ఉన్నారు.


