స్మార్ట్‌కు శ్రీకారం.. | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌కు శ్రీకారం..

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ఈనెల 15న బహిరంగ సభను నిర్వహించి.. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఈ స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేయనున్నారు. సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టిన అంబేద్కర్‌ స్టేడియాన్ని సోమవారం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ పరితోష్‌లు పరిశీలించారు. సభా వేధిక, సభకు హజరయ్యే వారికి కుర్చీలు, ఇతర సౌకర్యాలపై జగ్గారెడ్డి కలెక్టర్‌తో చర్చించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, బారికేడ్లు.. ఇలా భద్రత పరమైన ఏర్పాట్లను ఎస్పీ పరితోశ్‌పంకజ్‌ పరిశీలించారు. సీఎం హైదరాబాద్‌ నుంచి హెలీక్యాప్టర్‌లో జిల్లాకు రానున్న నేపథ్యంలో తారా డిగ్రీ కాలేజీ హెలీప్యాడ్‌ను కూడా సందర్శించారు.

జిల్లాకు వచ్చిన 4.46 లక్షల స్మార్ట్‌ కార్డులు..

ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ప్రభుత్వం కార్డుదారులకు ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పీవీసీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్‌ కార్డులను అందించనున్నారు. ఏటీఎం కార్డు తరహలో ఉండే ఈ కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, కార్డు నెంబర్‌తో పాటు, క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కార్డుదారుని కుటుంబసభ్యుల సమగ్ర వివరాలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4.46 లక్షల మంది రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. ఈ 4.46 స్మార్ట్‌ కార్డులు ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు చేరుకున్నాయి.

భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు

సీఎం సభకు భారీగా జన సమీకరణ చేయాలని ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వీలైనంత ఎక్కువ మంది కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులను ఈ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఈ సభకు జనసమీకరణ చేపట్టనున్నాయి. సంగారెడ్డితో పాటు, మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ సభకు తరలించే అవకాశాలున్నాయి.

ఈనెల 15న జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి

లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌ స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీకి ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణకు సమాయత్తం

కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి

అర్హులందరికీ కార్డులు

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డిల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సీఎం, మంత్రులకు ఘన స్వాగతం పలుకుతాయి. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నాం.

– జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement