మాస్టర్ప్లాన్ అమలుతో..!
త్వరలో సీఎం దగ్గరకు..!
‘ఏడుపాయల’కు
రూ.500కోట్లతో మాస్టర్ ప్లాన్
ఐదుశాఖల పరిధిలో..!
● ఎండోమెంట్ కమిషనర్తో చర్చించిన ఎమ్మెల్యే
● త్వరలో సీఎం దృష్టికి ఫైల్
ఏడుపాయల వనదుర్గామాత దేవస్థానం
స్వయంభూగా వెలసిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ రూపురేఖలు మారబోతున్నాయి. అందుకోసం రూ.500 కోట్లతో ఓ ఏజెన్సీ నిర్వాహకులతో స్థానిక ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్తో చర్చలు జరిపారు. ఈ ఫైల్ త్వరలో సీఎం దృష్టికి వెళ్లనుంది.
మెదక్జోన్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి శివారులోగల ఏడుపాయల వనదుర్గామాత ఆలయం రాతిగుహలో స్వయంభూగా వెలిసింది. ఇక్కడ మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏటా ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల నిధులు విడుదల చేసి రాష్ట్ర సర్కార్ తరఫున అమ్మవారికి ఎమ్మెల్యే పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే దసరా పండగను పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. మాఘ అమావాస్య రోజున పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిధిలో నిర్మించిన అద్దె రూములతోపాటు హరితహోటల్, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన గదులు (రూములు) ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు సరిపడా సౌకర్యాలు లేవు.
మారనున్న రూపురేఖలు!
ఈ మాస్టర్ ప్లాన్ అమలుతో ఏడుపాయల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఏమాత్రం పెద్ద వర్షం కురిసి ఎగువభాగంలోని ఘనాపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లినా వరదనీటితో అమ్మవారి ఆలయం మునిగిపోతుంది. దీంతో భక్తుల కోసం రాజగోపురంలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. ఇది ప్రతీఏటా జరుగుతున్నతంతు. కాగా, మాస్టర్ప్లాన్లో భాగంగా రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు భారీ బ్రిడ్జిని నిర్మించి లిఫ్టు ఏర్పాటు చేయనున్నారు. అటు అమ్మవారి ఆలయం ముందు, ఇటు రాజగోపురం ముందు రెండు సైడ్లలో సుమారు 12 ఫీట్ల ఎత్తులో గోడను నిర్మించనున్నారు. దీంతో ఎగువభాగం నుంచి ఎంత పెద్ద వరద వచ్చినా, ఆలయంలోకి నీరు వెళ్లదు. దీంతో వరదలు వచ్చినా రాజగోపురం నుంచి భారీ స్థాయిలో ఏర్పాటు చేసే లిఫ్టు ద్వారా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయానికి పక్కనే ఒడిబియ్యం, బోనాలకు, కుంకుమార్చన కోసం ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రాజగోపురం సమీపంలో ప్రసాదాల కౌంటర్, ఆఫీస్గెస్ట్ హౌజ్, టాయిలెట్స్, వాష్రూముల నిర్మాణాలు, బట్టలు మార్చుకునే గదులు, అక్కడి నుంచి నదీ తీరం ఘనాపూర్ ప్రాజెక్టు వరకు గార్డెన్ నిర్మాణం, నదీ వైపున ఫెన్సింగ్ ఏర్పాటు, నదిపొడుగునా షవర్ల నిర్మాణాలు, అండర్గ్రౌడ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
పార్కింగ్ స్థలాలు...
అలాగే భక్తులు ఉండేందుకు ఏడుపాయలకు వచ్చే పాతరోడ్డు నాగ్సాన్పల్లి వైపున రెండు పార్కింగ్ స్థలాలు అందులో ద్విచక్ర, ఫోర్వీల్స్లకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాటు, కాటేజీలు, మినీలాడ్జిల నిర్మాణం, అదేవిధంగా కొల్చారం వైపు నుంచి వచ్చే రూటులోనూ 2 పార్కింగ్ స్థలాలు, కాటేజీలు, మినీ లాడ్జిలు నిర్మించనున్నారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు ప్రైవేట్ ఏజెన్సీతో మాస్టర్ప్లాన్ సిద్ధం చేయించారు. సదరు ఏజెన్సీ నిర్వాహకులు పలు దఫాలుగా విజిట్ చేసి డ్రోన్ల సహాయంతో పలు నమూనాలను డిజైన్ చేసి రూ.500 కోట్ల ప్రాజెక్టుతో దీనికి కొత్త రూపురేఖలు తీసుకురావాలని నిర్ధారించారు. ఈ మాస్టర్ ప్లాన్ను సదరు ఎండోమెంట్ కమిషనర్ చర్చించి ఓకే చేసినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ సైతం పలుశాఖల అధికారులతో చర్చించారు. రేపో మాపో ఆ ఫైల్ సీఎం దగ్గరకు వెళ్లనుంది.
రూ.500 కోట్లతో తయారు చేసిన ఏడుపాయల మాస్టర్పా్ల్న్లో ఐదుశాఖల ఉన్నతాధికారుల నుంచి పలు సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బీ, పర్యాటక, ఎండోమెంట్కు చెందిన అధికారులు ఇందుకు తగు సలహాలు సూచనలు చేసినట్లు సమాచారం.
ఏడుపాయల అభివృద్ధికోసం రూ.500 కోట్లతో తయారు చేయించిన మాస్టర్ప్లాన్ను త్వరలో సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్తాను. ఈ ఆలయాన్ని సీఎం గతంలో స్వయంగా దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. నిధుల మంజూరుతో ఆధ్యాత్మికతోపాటు, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందనుంది.
–డాక్టర్ రోహిత్రావు, ఎమ్మెల్యే, మెదక్


