జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్జోన్: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. జాతీయ ‘సైబర్ జాగృత్ దివస్’సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ’కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సైబర్ నేరాల కారణంగా కోట్ల రూపాయలను ప్రజలు నష్టపోతున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచించారు. మోసగాళ్లు ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి, కొందరు వ్యక్తులు భారీగా లాభాలు పొందినట్లు నకిలీ స్క్రీన్ షాట్లు, సందేశాలను షేర్ చేస్తారని చెప్పారు. వాటిని నమ్మి పెట్టుబడులు పెడితే నష్టాలు తప్పవన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


