మెదక్జోన్: జిల్లాలో 21 మండలాల పరిధిలో 492 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు ఉండగా.. నిత్యం ఏదో ఒక చోట పలువురు కుక్క కాటుకు గురై నిత్యం ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారిక లెక్కల ప్రకా రం ఈ ఏడాది ఇప్పటివరకు 980 పైచిలుకు మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ లెక్కన నెలకు 140 మందికి పైగా వీటి బారిన పడుతు న్నారు. ఇంత జరుగుతున్నా కుక్కలను అరికట్టేందుకు అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా బడికి వెళ్లిన విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో.. లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నియంత్రణ అంతంతే!
శునకాలను నియంత్రణకు జిల్లా కేంద్రంలో శస్త్రచికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే దీనిని అడపాదడపా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒక్కో శునకానికి శస్త్ర చికిత్స చేయాలంటే రూ. 1,600 ఖర్చు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంత మొత్తం చెల్లించి నియంత్రణ చేయిస్తే మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో పాలకవర్గాలు పెద్దగా దృష్టి సారించలేక పోతున్నాయి. ఫలితంగా కుక్కల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.
పట్టణంలోని పలు వార్డుల్లో సంచరిస్తున్న కుక్కలను ఓ ఏజెన్సీ ద్వారా పట్టి నియంత్రణ కోసం శస్త్ర చికిత్స చేస్తున్నాం. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక భారంగా మారుతుంది. త్వరలో మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటాం.
– నవీన్, మెదక్ మున్సిపల్ కమిషనర్


