నిన్న యూరియా..
ఇక ఎరువులన్నీ యాప్లోనే!
పట్టా లేని రైతులకు కష్టాలే
జిల్లాలో వివిధ సమస్యల్లో ఉండి, పట్టాలు లేని భూముల్లో పలువురు రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ, శిఖం భూములు, ఎండోమెంట్, వర్క్స్ బోర్డు, సీలింగ్, వివాదస్పద భూములను కొంతమంది రైతులు ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. పట్టాలు లేకపోవడంతో సంబంధిత రైతులకు యాప్ పద్ధతిన ఎరువులు దొరికే అవకాశం ఉండదు. దీంతో వీరికి యాప్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ మాట్లాడుతూ.. త్వరలో ఎరువులన్నీ యాప్ పద్ధతిన మాత్రమే విక్రయిస్తామన్నారు. ఇప్పటికే రెండు జిల్లాలో ఈ పద్ధతి అమలవుతోందని చెప్పారు. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
మెదక్ అర్బన్: ‘యూరియా బ్యాగ్ తయా రీకి అయ్యే ఖర్చు రూ.1,947. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1680.50. రైతులకు అమ్మాల్సిన ధర రూ. 266.50. మామూలుగా నత్రజని ఉన్న కాంప్లెక్స్ వాడితే, అదనంగా ఎకరాకు యూరియా ఒకటి నుంచి ఒకటిన్నర బస్తా సరిపోతుంది. కానీ ధర తక్కువగా ఉండటంతో రైతులు 3 బస్తాల వరకు వాడుతున్నారు. అలాగే కాంప్లెక్స్ తయారీకి రూ.3171.30 ఖర్చు అనగా, కేంద్రం రూ.1021.30 సబ్సిడీ ఇస్తుంది. విక్రయ ధర రూ.2150. ఇది ఎకరాకు రెండు బ్యాగులు సరిపోతుంది. కానీ 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. దీంతో అటు వృథాతో పాటు ఇటు కేంద్రంపై సబ్సిడీ భారం తడిసి మోపెడవుతోంది. అందుకే ఎరువుల పంపిణీకి యాప్ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది’
ప్రయోగాత్మకంగా అమలు
నిన్న యూరియా.. రేపు కాంప్లెక్స్ ఎరువులు యాప్ ద్వారా విక్రయాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో యాప్ ద్వారా ఎరువుల సరఫరా ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈనెల 28 నుంచి మెదక్ జిల్లాలో యాప్ పద్ధతిన కాంప్లెక్స్ ఎరువులు సరఫరా చేస్తారని ప్రచారం జరుగుతుండగా, అధికారులు మాత్రం త్వరలోనే యాప్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
59,870 మెట్రిక్ టన్నులు అవసరం
కాలం కలసి వస్తే అనుకున్న ప్రకారం 3,67,668 ఎకరాల్లో పంటలు సాగు అయితే మొత్తం 59,870 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇందులో యూరియా 26,500, డీఏపీ 242, ఎంఓపీ 2317, కాంప్లెక్స్ 27,480, ఎస్ఎస్పీ 1153 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. కాగా యాప్ ద్వారా స రఫరా అయితే, వీటి వినియోగం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డిలో ప్రారంభం జిల్లాలో ఈనెల 28 నుంచి అమలు!


