జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయసు గల 1,81,425 మంది పిల్లలను అధికారులు గుర్తించారు. వీరిలో నులిపురుగుల నిర్మూలనకు మొత్తం 2,36,400 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం చేసి ఉంచారు. సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రుల్లో మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ దిశానిర్దేశం చేశారు. ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రార్థన అనంతరం పిల్లలకు చేతుల పరిశుభ్రత, ఆల్బెండజోల్ మాత్రల గురించి అవగాహన కల్పించి, అనంతరం మాత్రలు పంపిణీ చేస్తారు.
వేసుకోని వారికి 20న పంపిణీ
నేడు మాత్రలు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్ల ల కోసం ఈనెల 20వ తేదీన మాపప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తారు. కడుపులో నులి పురుగులు ఉంటే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, అలసట, శారీరక మానసిక ఎదుగుదల సరిగా ఉండకపోవడం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బలహీనత, బరువు తగ్గడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. తద్వారా ఆరోగ్యం దెబ్బతిని ఎప్పుడూ నీరసంగా ఉంటారు. చదువు, ఆటల్లో వెనకబడిపోతారు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం వల్ల కడుపులో పెరిగే నులిపురుగులను నిర్మూలిస్తుంది. ఈ మాత్రలతో పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. నిపుణులైన పిల్లల వైద్యులను అందుబాటులో ఉంచుతారు.
నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
జిల్లాలో 1,81,425 మంది పిల్లల గుర్తింపు
2,36,400 ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు


