మున్సిపల్ కమిషనర్ సాయికుమార్
నర్సాపూర్: ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వానాకాలం సీజన్లో వర్షపాతం తక్కువగా నమోదు అవుతున్నందున వర్షం నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపితే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. బోరుబావుల నుంచి నీరు ఎక్కువగా రావడంతో పాటు భూకంపాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు. పట్టణంలో 200 గజాలు, అంతకన్న ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించే ప్రతి యజమాని ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. నిర్మాణం చేపట్టని యజమానులపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని మంగళపర్తికి చెందిన సంఘ సేవకుడు రాఘవేందర్రావుకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా అవకాశం రావడంపై నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న రాఘ వేందర్రావుకు ఈ బాధ్యత రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ నియామకం ద్వారా దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆదివారం డీసీసీ ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డితో పాటు పలువురు నాయకులు, గ్రామ పెద్దలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
శివ్వంపేట (నర్సాపూర్): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నరేందర్ తెలిపారు. పిల్లుట్ల విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.
హవేళిఘణాపూర్(మెదక్): నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని హవేళిఘణాపూర్, బూర్గుపల్లి, వాడి, కొత్తపల్లి, రాజ్పేటకు చెందిన సుమారు 62 మందికి ఆదివారం చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మె ల్యే రోహిత్ సహకారంతో చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్గౌడ్, నాయకులు మహేందర్రెడ్డి, సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తూప్రాన్: పీసీసీ అధ్యక్షుడు తీర్మానించిన కమిటీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చిటుకుల మహిపాల్రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్లో వారు మాట్లాడుతూ.. పీసీసీకి వ్యతిరేకంగా గజ్వేల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి కమిటీలు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. చర్యలు తీసుకోకుంటే 10 వేల మందితో గాంధీభవన్కు వెళ్తామన్నారు. కాగా, మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ మూతపడే వరకు ప్రజల పక్షానా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగులపల్లి శ్రీనివాస్రెడ్డి, మల్లారెడ్డి, విశ్వరాజ్, నాగరాజు గౌడ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


