తూప్రాన్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ నుంచి వెలువడే విషపూరితమైన కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరం అన్నారు. ఇప్పటికే అనేక మంది వివిధ రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాడి ఎంఎస్ అగర్వాల్ కంపెనీని పారదోలి, మన ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమ నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. దీక్షకు రంగాయపల్లి, చెట్ల గౌరవం గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కాగా, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణగౌడ్, వెంకట్గౌడ్, శేఖర్గౌడ్, సాయిగౌడ్, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.
నిరాహార దీక్ష చేపట్టిన వంటేరు ప్రతాప్రెడ్డి


