గజ్వేల్: మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మా ర్గంలోని రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీరు మొదలుకొని ఇతర కనీస వసతులు కరువయ్యాయి. ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగకపోవడంతో ట్రాక్లు దాటడం ప్రమాదకరంగా మారింది.
50 శాతం వరకు పనులు పూర్తి
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున న్యూబ్రాడ్గేజ్ లైన్న్ నిర్మాణం జరుగుతుండగా.. రూ. 1160.47 కోట్లను వెచ్చిస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీ దుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్నతో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా లాంటి మహా నగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. ఉత్తర తెలంగాణ లోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు 74 కిలోమీటర్ల మేర.. అంటే మొత్తం లైన్ పొడవులో 50 శాతం వరకు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల వైపునకు పను లు సాగుతున్నాయి. కాగా 2023 అక్టోబర్ 3న ప్యాసింజర్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ట్రాక్లు దాటాలంటే నరకమే
ఈ లైన్పై మనోహరాబాద్ తర్వాత నాచారం(స్టేషన్), అప్పాయిపల్లి (హాల్ట్), గజ్వేల్ (స్టేషన్), కొడకండ్ల (హాల్ట్), లకుడారం (స్టేషన్), కొమురవెల్లి (హాల్ట్), దుద్దెడ (స్టేషన్), సిద్దిపేట(స్టేషన్) ఉన్నాయి. స్టేషన్లతో పాటు హాల్ట్ స్టేషన్లలోనూ కనీస వసతులు కరువయ్యాయి. గజ్వేల్లో ప్రయాణికులు ట్రాక్పై ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రారంభించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పిల్లర్ల దశలో నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాక్ను దాటడం ప్రమాదకరంగా పరిణమించింది. నాచారం స్టేషన్ గ్రామానికి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. లకుడారం, దుద్దెడ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు కనీస తాగునీటి వసతి కూడా సక్రమంగా లేదు. పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాష్రూమ్లు వాడకంలో లేవు. మరోవైపు ఏ స్టేషన్లోనూ తగినంత సిబ్బంది లేరు. హాల్ట్ స్టేషన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిర్వహణ లేక ఈ స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కాగా ఈ మార్గంలో నడుస్తున్న రైలు వేగం పెంచకపోవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి తగ్గుతుంది.
రైల్వేస్టేషన్లలో కనీస వసతులు కరువు
తాగునీరు మొదలుకొని
అన్నింటికీ తిప్పలే..
సిబ్బంది కొరతతో అరకొర సేవలు


