ఎస్సీలపై అట్రాసిటీ కేసులా?
అధికారులను ప్రశ్నించిన ఎస్సీ, ఎస్టీకమిషన్ చైర్మన్ వెంకటయ్య
మెదక్జోన్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీ క్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన మెదక్ పట్టణంలో జరిగిన ఓ గొడవలో 13 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, అందులో అందులో ఆరుగురు ఎస్సీ వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఈవిషయంపై డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. దాడిచేసిన వారిపై 307తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశామని, ఎస్సీలకు కేవలం దాడి కేసు మాత్రమే వర్తిస్తుందన్నారు. కేసుల విచారణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చైర్మన్ వెంకటయ్య అన్నారు. ఈసందర్భంగా జిల్లాలో జరిగిన పలు సంఘటనలు ప్రస్తావించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు డబుల్ బెడ్రూంలను పంపిణీ చేశామని వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ శ్రీనివాసరావు, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


