ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య
రామాయంపేట(మెదక్): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే పారుతున్న మురుగు కాలువ, లోతట్టు ప్రదేశాలను ఇంజనీరింగ్ అధికారులు, పాలకవర్గం సభ్యులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెలుతుందని, దీంతో రెండు చెరువుల్లో నీరు కలుషితమవుతుందని అన్నారు. చిన్నపాటి వర్షం కురిసినా పట్టణంలోని 11, 12 వార్డుల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. రామాయంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, సందీప్, శ్యామల, చరిత, రవి, శంకర్గౌడ్, ఇతర నాయకులు ఉన్నారు.


