అర్హులకు సంక్షేమ ఫలాలు చేరాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలని, జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల గురించి డీఈఓ, డీఐఈఓలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవితో పాటు జిల్లా అధికారులంతా ఆమెకు ఘన స్వాగతం పలికారు. మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి, డీఐఈఓ మాధవి, డీఈఓ విజయ, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్రావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని, మరిన్ని విషయా లు తెలుసుకొని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు జవాబుదారితనంతో పనిచేసేలా చర్యలు చేపడతానని వివరించారు.
అభివృద్ధికి అందరూ సహకరించాలి
నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్


