ఎకరాకు రూ.40.50 లక్షలు
ట్రిపుల్ఆర్ భూములకు పరిహారం
నర్సాపూర్: ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూములకు ఎకరాకు సుమారు రూ. 40.50 లక్షలు ఇవ్వనున్నట్లు ఆర్డీఓ మహిపాల్ చెప్పారు. ఉత్తర భాగం కోసం శివ్వంపేట మండలం లింగోజిగూడ, కొత్తపేట, కొంతాన్పల్లి, రత్నాపూర్, పాంబండ, పోతుల్బుగూడ గ్రామాలకు చెందిన భూములు కోల్పోతున్న రైతులతో బుధవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవార్డు సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎకరానికి రూ. 13.50 లక్షల మార్కెట్ ధరను నిర్ణయించిందని, ఆ ధరకు మూడింతలు పరిహారం అందజేస్తున్నామని వివరించారు. భూములు కోల్పోతున్న రైతులందరూ బ్యాంకు ఖాతా నంబర్లు అందజేయాలని సూచించారు. కాగా ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం చాలా తక్కువగా ఉందని, తమకు నష్టం కలుగుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీ అభ్యర్థనను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో శివ్వంపేట తహసీల్దార్ కమలాద్రి తదితరులు పాల్గొన్నారు.


