ఇంటర్ విద్యార్థులకు‘వెల్కమ్’ కిట్లు
ఇంటర్మీడియెట్ కళాశాలలు ఇంతవరకు ఇంటర్ బోర్డు పరిధిలో ఉండేవి. గతంలో 1 నుంచి పదోతరగతి వరకు సమగ్రశిక్ష అధీనంలో ఉండేది. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య సమగ్రశిక్ష అధీనంలోకి వచ్చింది. దీంతో సమగ్రశిక్ష నిధులు ఇంటర్మీడియెట్ వరకు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు రెండు ఉచిత యూనిఫారాలు, టెక్స్, వర్క్ బుక్స్, మధ్యాహ్న భోజనం, టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గురుకుల కాలేజీ విద్యార్థులకు సైతం ఇలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ లాంటి సౌకర్యాలు లేవు. ఈ సారి విడుదలకానున్న సమగ్ర నిధులతో విద్యార్థులకు వెల్కమ్ కిట్లు అందజేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 6.099 మంది విద్యార్థులున్నారు. మొదటి సంవత్సరం 3,151, రెండో సంవత్సరంలో 2,948 విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు కొత్తగా చేరనున్న వారికి వెల్కమ్ కిట్లు అందనున్నాయి. అందులో రెండు జతల యూనిఫారాలు, నోట్ బుక్లు, వర్క్బుక్లు అందజేయనున్నారు. ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమైనందున అందుకనుగుణంగా మెటీరియల్ కూడా అందజేయనున్నారు. అలాగే సమగ్ర శిక్ష నిధుల ద్వారా క్రీడా పరికరాలు, అలాగే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ల్యాబ్లు తదితర నిర్వహణకు నిధులు విడుదలయ్యాయి. దీంతో ఇంటర్ విద్యకు ఆశించిన ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
మెదక్అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చేరే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వివిధ వస్తువులతో కూడిన వెల్కమ్ కిట్లు అందజేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పేద విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కిట్ పంపిణీ ప్రధాన ఉద్దేశ్యం. దీనిని సర్కార్ ఆమోదిస్తే కళాశాలలో అడుగుపెట్టిన మొదటిరోజే విద్యార్థులకు అందజేయనున్నారు. మెదక్ జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా వాటిలో సుమారు ఆరువేల మంది విద్యార్థులతో పాటు నూతనంగా చేరే వారికి మేలు జరగనుంది.
గురుకులాలకు ధీటుగా..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
వచ్చే ఏడాది నుంచి అమలు
జిల్లాలో 16 జూనియర్ కాలేజీలు
6,099 మంది విద్యార్థులకు లబ్ధి
ప్రతిపాదనలు పంపించాం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వెల్కమ్ కిట్లు అందజేయడానికి ఇంటర్ విద్యాశాఖ తరఫున ప్రతిపాదనలు వెళ్ళాయి. ఇంకా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. ఉత్తర్వులు రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెల్కమ్ కిట్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. వీటి వల్ల ప్రభుత్వ కళాశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని భావిస్తున్నాం.
– మాధవి, నోడల్ అధికారి,
ఇంటర్మీడియెట్