మార్కెట్ ధరకు మూడింతలు
నర్సాపూర్: భూములు కోల్పోతున్న రైతులకు చట్టం పరిధిలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ మహిపాల్ చెప్పారు. త్రిబుల్ ఆర్ కోసం భూములు కోల్పోతున్న పలు గ్రామాలకు చెందిన రైతులతో మంగళవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారులు నిర్ణయించిన ధర మేరకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరకు మూడింతలు చెల్లిస్తామన్నారు. మరింత ఆర్థిక సహాయం కోసం కలెక్టర్కు పిటిషన్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. రైతులు మధ్యవర్తుల జోలికి వెళ్లవద్దని, నేరుగా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకోవాలన్నారు. భూములలో బోర్లు, చెట్లు, పైపులైను తదితర ఏమైనా ఉంటే వాటికి ఆయా శాఖల అధికారులు నిర్ణయించే ధరను చెల్లిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు.
తక్కువ ధరతో అన్యాయం
చిన్నచింతకుంటకు చెందిన రైతు రవి మాట్లాడుతూ.. తన భూమి జాతీయ రహదారిని ఆనుకుని ఉందని, ఎకరానికి సుమారు రూ.4 కోట్లు ధర పలికే అవకాశం ఉందన్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే ధర చాలా తక్కువ అవుతుందని, తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ రికార్డులో ఒకరి పేరుండగా సాగు మరొకరు చేస్తున్న భూములకు ఎలా డబ్బు చెల్లిస్తారని రైతులు అడగ్గా.. అలాంటి భూముల సొమ్ము చెల్లించకుండా ఆపుతామని, సమస్య పరిష్కారం అయ్యాక చెల్లిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూనిర్వాసితులకు ఆర్డీఓ హామీ
దళారులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి


