తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయొద్దు
డీఐఈఓ మాధవి
రామాయంపేట(మెదక్): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థానానికి ఎదగాలని జిల్లా ఇంటర్ విద్యాధికారిణి మాధవి సూచించారు. శుక్రవారం పట్ట ణంలోని స్నేహా జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలను వమ్ము చేయవద్దన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులను చదువులో ఉన్నత స్ధానానికి ఎదిగే విధంగా కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని, ఏటా రాష్ట్రస్థాయి ర్యాంకులతో ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఈసారి పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కరస్పాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నాలుగైదేళ్లుగా తమ కళాశాల సాధిస్తున్న ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజని, సీఐ వెంకట్రాజాగౌడ్, ఎస్ఐ బాలరాజు, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


