పద్యం చెప్పండి.. రూ.10 పట్టండి
పాపన్నపేట(మెదక్): ‘పద్యం చెప్పండి.. రూ.10 పట్టండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఓ రిటైర్డ్ హెచ్ఎం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో పద్యాల పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో మెదక్ మండలం మాచవరానికి చెందిన సాంబశివరావు శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఒక్కో పద్యానికి రూ.10 చొప్పున, విద్యార్థులు ఎన్ని పద్యాలు చదివితే అన్ని పదుల నగదు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రకళ, టీచర్లు పాల్గొన్నారు.


