74 వార్డులు.. 148 కేంద్రాలు
రామాయంపేట(మెదక్): నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తించిన కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. మెత్తం 75 వార్డులకు గాను మెదక్లో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, మిగితా 74 వార్డుల్లో 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వసతులు లేని కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. ఒక్కో బూత్లో ఒక సీసీ కెమెరాను బిగించి అవసరమైన చోట ర్యాంపులు నిర్మించారు.
పూర్తి స్థాయిలో వసతుల కల్పన
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పిట్లంబేస్లో ఉన్న పోలింగ్ కేంద్రం కిటికి పాక్షికంగా శిథిలమవడంతో కొత్తగా ఏర్పాటు చేశారు. పాత ర్యాంపులకు మరమ్మతులు చేయించారు. కొత్తగా మరో పది వరకు నిర్మించారు. వీటితో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయించి లైటింగ్ సదుపాయం కల్పించారు. మెదక్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమరాలు బిగించారు.రామాయంపేటలోని 24 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో లైట్లు ఫ్యాన్లు, సీసీ కెమెరాలు బిగించారు. పట్టణంలో స్నేహ కళాశాలలో ఉన్న మూడు పోలింగ్ కేంద్రాలకు మూడు ర్యాంపులు నిర్మించాల్సి ఉండగా, కేవలం ఒకటి మాత్రమే నిర్మించారు. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెండు కేంద్రాల్లో సైతం ర్యాంపులు నిర్మించాల్సిన అవసరం ఉంది. తూప్రాన్లోని 32 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలకు మరమ్మతులు చేశారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ర్యాంపు నిర్మాణానికి స్థలం సరిపోకపోవడంతో ఫ్లైవుడ్తో ఏర్పాటు చేశారు. నర్సాపూర్లోని 30 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం పూర్తయింది. లైటింగ్, ఫ్లాన్లు బిగించారు. మరుగుదొడ్లకు మరమ్మతు చేశారు.
కేంద్రాలు
జిల్లాలో ఇలా...
మున్సిపాలిటీ వార్డులు పోలింగ్
మెదక్ 32 64
నర్సాపూర్ 15 30
తూప్రాన్ 16 32
రామాయంపేట 12 24
ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం
ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటు
ర్యాంపుల నిర్మాణం సైతం పూర్తి


