అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో పార్టీ అభ్యర్థి మల్లేశంకు మద్దతుగా శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని వాపోయారు. భగీరథ నీటికి బిల్లులు వేయడం అన్యాయమన్నారు. బిల్లుల కోసం ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, బాదె చంద్రం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘జీఓ 25ను సవరించండి’
వెల్దుర్తి(తూప్రాన్): జీఓ 25ను సవరించిన తర్వాతే రేషనలైజేషన్ ప్రకియ మొదలు పెట్టాలని ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. 1 నుంచి 20 వరకు విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు ఇద్దరు, 20 నుంచి 40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు, 60కి పైగా విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఉపాధ్యాయులను నియమించాలన్నారు.


