గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాదే
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయని, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. శుక్రవారం రామాయంపేటలోని పలు వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి బాధ్యతలను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ను కాదని ఇతర పార్టీల వారికి ఓటు వేస్తే ప్రగతి ఆగిపోతుందన్నారు. తన కుమారుడు రోహిత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రూ. 200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. తామిచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామన్నారు. మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ ఎన్నికల ఇన్చార్జి మహిపాల్రెడ్డి, నాయకులు నాగరాజు, అమరసేనారెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు చింతల స్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు
మైనంపల్లి హన్మంతరావు


