కీలకంగా ఎక్స్ అఫీషియోలు!
రామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక విషయమై ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించనున్నారు. వీరికి ఓటు వేసే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంపీతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈనెల 16న మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈఎన్నికల్లో వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈమేరకు వీరు ఈనెల 11 నుంచి 14లోగా తాము ఓటు వేయబోయే మున్సిపాలిటీల వివరాలు ఎన్నికల అధికారు లకు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 13లోగా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుండగా, తమ పార్టీలకు సంబంధించి చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక విషయమై మెజార్టీని బట్టి వీరు ఓటు వేసే అవకా శం ఉంది. ప్రధానంగా మెదక్ నియోజకవర్గ పరిధిలో రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలుండగా, చైర్మన్ల ఎంపిక కోసం సందర్భాన్ని బట్టి ఎమ్మెల్యే ఎక్కడైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మెదక్ ఎంపీ తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ బల్దియాలోనైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు సైతం తమ పరిధిలోని ఏ మున్సిపాలిటీలోనైనా ఓటు వేయవచ్చు. కాగా చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. ఈ మేరకు వీరు సంబంధిత మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


