సజావుగా ఇంటర్ ప్రాక్టికల్స్
కొల్చారం(నర్సాపూర్): ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చూడాలని కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో జరుగుతున్న ప్రా క్టికల్స్ పరీక్షలను పరిశీలించారు. ల్యాబ్ గదులు, ల్యాబ్ మెటీరియల్ను పరిశీలించి, ప్రాక్టికల్స్ ఏ విధంగా జరుగుతున్నాయనే విషయమై విద్యార్థులతో ఆరా తీశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల రికార్డులను, పరీక్షల సందర్భంగా గదుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు కళాశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి మాధవి, చీఫ్ సూపరింటెండెండ్ నవీన్, కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్


