షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్
డీటీఓ వెంకటస్వామి
మెదక్ కలెక్టరేట్: ఇక నుంచి నూతన వాహనాలకు షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి తెలిపారు. గురువారం పట్టణంలోని ఓ హీరో మోటార్ షోరూంలో వాహనదారులకు టీఆర్ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి జిల్లాలో అమలులోకి వచ్చినట్లు చెప్పారు. ఇది కేవలం నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనదారులకే వర్తిస్తుందన్నారు. నూతన విధానంతో వాహనాలు కొనుగోలు చేసే వారు డీటీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఎలాంటి అదనపు చార్జీలు ఉండవన్నారు. ఇందుకోసం అవసరమైన పత్రాలను డీలర్లే డీటీఓ కార్యాలయానికి చేరుస్తారని వివరించారు. రవాణా శాఖ కార్యాలయంలో పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామని పేర్కొన్నారు. ఆపై గతంలో మాదిరిగానే స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి కార్డు చేరుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో హీరో మోటార్స్ యజమాని బండ నరేందర్, బద్రినాథ్, వాహనదారులు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


