కొత్త టెక్నాలజీతో భూముల సర్వే
పటాన్చెరు టౌన్: అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేపడుతున్నామని అందుకు 5,500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమించామని, భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల కాంప్లెక్స్కు మంత్రి వివేక్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పారదర్శకంగా, అవినీతిరహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తోందని చెప్పారు. మొదటి విడతగా ఓఆర్ఆర్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు. కర్ధనూర్లో 20వేల చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తోన్న కార్యాలయానికి మూడు ఎకరాల భూమిని కేటాయించినట్లు వివరించారు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
5,500 మంది లైసెన్స్డ్
సర్వేయర్లను నియమించాం
మంత్రి వివేక్తో కలిసి సబ్ రిజిస్ట్రార్
కాంప్లెక్స్కు శంకుస్థాపన


