తిర్యాణి: ఇంటి సమీపంలోని చిన్నపాటి పెరటి భూమి వివాదం హత్యాయత్నానికి దారి తీసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని తలండి గ్రామానికి చెందిన కుర్సింగ జ్యోతి అదే గ్రామానికి చెందిన వరుసకు అన్న అయ్యే టేకం తిరుపతితో కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. శుక్రవారం రాత్రి గ్రామంలో దండారీ ఉత్సవాలను చూసేందుకు కుటుంబ సభ్యులు వెళ్లగా జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉంది. గమనించిన తిరుపతి మద్యం మత్తులో ఆమె మెడపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. అరుపులు వినిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్కు తరలించారు. జ్యోతి మామ కుడిమెత బాదిరావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.


