మంచిర్యాలటౌన్: భూముల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ ఫీజు చె ల్లించేవారికి ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించినా జిల్లాలో స్పందన అంతంత మాత్రంగా నే ఉంది. ఈ నెలాఖరుతో గ డువు ముగియనుండగా ప్ర భుత్వం ఆశించిన ఆదా యం సమకూరేలా లేదు. 2020 ఆగస్టు 26కు ముందు అనధికార భూములున్నవారు ఎల్ఆర్ఎస్ కోసం రూ.వెయ్యి చె ల్లించి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 55,380 దరఖాస్తులు వచ్చినా వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని క్రమబద్ధీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములను క్రమబద్ధీకరిస్తున్నా ప్రజ ల నుంచి అంతగా స్పందన రాలేదు. దీంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించి గతేడాది మార్చి 31వరకు చెల్లింపు గడువు విధించింది. కానీ, ప్రభుత్వం ఆశించిన స్పందన రాలేదు. సమయం తక్కువగా ఉండడం, రూ.వేలల్లో ఫీజు చెల్లించాల్సి ఉండడంతో చాలామంది ఆసక్తి చూపించలేదు. దరఖాస్తు చేసుకోని వారికి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫీజు చెల్లించే అవకా శం కల్పించింది. అప్పుడు స్పందన అంతంత మా త్రంగా ఉండడంతో ప్రభుత్వం ఈ ఏడా ది మరోసారి రాయితీ కల్పిస్తూ మే నుంచి ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించింది.
సర్కారుకు రూ.34.83 లక్షల ఆదాయం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల పరిధిలో 39,043 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన 25శాతం రాయితీ వినియోగించుకుని 5,097 మంది దరఖాస్తుదారులు భూములను క్రమబద్ధీకరించుకున్నా రు. ఆ తర్వాత దరఖాస్తుదారుల నుంచి అంతగా స్పందన రాకపోవడం, భూక్రయవిక్రయాలు తగ్గి పోవడంతో ప్రభుత్వం మరోసారి గడువు విధించింది. ఈసారి ప్రజల నుంచి స్పందన రాగా, 12,025 మంది దరఖాస్తుదారులు 25శాతం రాయితీ విని యోగించుకుని ప్లాట్లు క్రమబద్ధీకరించుకున్నారు.
గ్రామపంచాయతీల పరిధిలో ఇలా..
గ్రామపంచాయతీల పరిధిలో 8,340 దరఖాస్తులు రాగా, గతేడాది 2,402 మంది దరఖాస్తుదారులు రాయితీ వినియోగించుకున్నారు. ఇటీవల మరో 3,511 మంది ఫీజు రాయితీ పొంది భూములను క్రమబద్ధీకరించుకున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.34.83 లక్షల ఆదాయం సమకూరింది.
అవగాహన కల్పిస్తున్నాం
భూముల క్రమబద్ధీకరణకు 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. దరఖాస్తుదారులు ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకుని భూములను క్రమబద్ధీకరించుకోవాలి.
– సంపత్, మంచిర్యాల కార్పొరేషన్
టౌన్ ప్లానింగ్ అధికారి
సందేహాల నివృత్తికి ‘హెల్ప్లైన్’
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు మంచిర్యాల కార్పొరేషన్, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల పరిధిలో వార్డు ఆఫీసర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి నేరుగా ఫోన్ చేసి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పనిదినాల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు 08736–250501 నంబర్కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు. అయినా, దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.


