గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలి
ఉట్నూర్రూరల్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని నిబంధనల పేరుతో అడ్డుకోకుండా మానవత దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మట్, ఆదిలాబాద్ ఏఎస్పీ మౌనిక, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో గిరిజనులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇండ్ల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులను కోర్ ఏరియా పేరిట అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. తాగునీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలతో పాటు పీఎం జన్మన్ ద్వారా గిరిజనులకు అందుతున్న లబ్ధి వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, అధికారులు, నాయకులు ఉన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే అభివృద్ధికి దూరం’
ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాల న సాగించిన బీఆర్ఎస్, ప్రస్తుతం పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గ్రామీణ ప్రాంత గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని హర్కపూర్అంద్గూడ, మచ్చపూర్ గ్రామాల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మచ్చపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో పూజలు చేశారు. మెస్రం వంశీయులు, అధికారులు ఆయనను సన్మానించి నాగోబా ప్రతిమ అందించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, డీటీడీఓ అంబాజీ, నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, సర్పంచ్లు మెస్రం తుకారం, రాథోడ్ రోహిదాస్, అనసూయ ఉన్నారు.


