క్యాతనపల్లి ఎన్నికల్లో తప్పు చేసిందే బీఆర్ఎస్
కావాలని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది
మాజీ ఎమ్మెల్యే రాళ్ల దాడి చేయడం సమంజసమా!
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్
చెన్నూర్: క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ కౌన్సిలర్లను అభినందించేందుకు, ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవడానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి వెళ్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాళ్ల దాడి చేసి తప్పు చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందనే విషయం ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొరపాటు చేసి కాంగ్రెస్పై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా చేసిన సుమన్ జులుం చేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాళ్లదాడిలో తమ కార్లు ధ్వంసమైనా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పోలీసు కానిస్టేబుల్కు బలమైన గాయం కావడంతో పోలీసులు సుమన్పై కేసు పెట్టారని, తప్పులు చేసి తప్పించుకోవాలని చూస్తే చట్టం ఊరుకోదని, చట్టం పని చట్టం చేస్తుందని తెలిపారు.
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆధునిక సాంకేతికతను జోడిస్తూ సేంద్రియ సాగుపై దృష్టి సారించి దిగుబడితోపాటు ఆదాయం పొందాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. శుక్రవారం గుడిపేట రైతువేదికలో ఆత్మ పథకంలో భాగంగా మంచిర్యాల, చెన్నూర్ డివిజన్ పరిధిలోని పలువురు రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తలు చర్చాగోష్టి నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి సురేఖ మాట్లాడుతూ రసాయన రహిత సహజ వ్యవసాయం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్పొరేటర్ లగిశెట్టి రాజన్న, ఆత్మ చైర్మన్ మురళీ, హాజీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ బొడ్డు శకర్, కేవీకే శాస్త్రవేత్త సాద్వి, ఏడీఏలు కృష్ణ, ప్రసాద్, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.


