పరీక్షల సీజన్.. నేత్రాలు పదిలం!
● కళ్లపై ఒత్తిడి పెంచొద్దు
● తగిన జాగ్రత్తలు అవసరం
● 20 –20 –20 నియమం పాటించాలి: ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలి.
● తగినంత వెలుతురు అవసరం: మసకబారిన కాంతిలో, చీకటి గదుల్లో చదవడం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రకాశవంతమైన, సమానంగా విరజిమ్మే కాంతి ఉండాలి.
●స్క్రీన్ టైమ్ తగ్గించాలి: మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. విద్యాపరమైన అంశాలలో అవసరమైతేనే పరిమితంగా వాడాలి.
● సరైన దూరం పాటించాలి: పుస్తకాన్ని కనీసం 30 –40 సెంటీమీటర్ల దూరంలో ఉంచి చదవాలి.
● ఎక్కువ సేపు చదివేటప్పుడు కళ్లను సహజంగా చిమ్మడం, తెరవడం, మూయడం తగ్గిపోతుంది. కావున ఉద్దేశపూర్వకంగా కళ్లను తరచుగా మూసి తెరవాలి.
● ఆహారం, నిద్ర కూడా ముఖ్యం: క్యారెట్, పాలకూర, గ్రీన్ లీవ్స్, పండ్లు వంటి విటమిన్ ఏ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 6 –8 గంటలు నిద్ర ఉండాలి.
● కంటి ఎర్రదనం, నీరూరడం, తీవ్ర తలనొప్పి, చూపు తగ్గిన భావన వంటి లక్షణాలు గమనిస్తే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా మందులు కొనుగోలు చేసి వాడకూడదు.
● పరీక్షల సమయంలో చదువుతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి. కంటి సంరక్షణలో చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను నివారించగలవు.
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతుండగా, మరో రెండు వారాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు రోజంతా పుస్తకాలు చదవడం, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండడంవల్ల నయనాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో కంటి సంరక్షణను విస్మరించకూడదని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటి నొప్పి, డ్రైనెస్ భావన, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ యు.కృష్ణంరాజు విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..