కన్నకొడుకే కాలయముడు.. రోకలితో.. | - | Sakshi
Sakshi News home page

కన్నకొడుకే కాలయముడు.. రోకలితో..

Aug 1 2023 12:22 AM | Updated on Aug 1 2023 1:07 PM

- - Sakshi

మంచిర్యాల: మద్యం మత్తులో జరిగిన తగవు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవలో కన్నతండ్రినే కుమారుడు రోకలితో మోది హత్యచేసిన ఘటన కౌటాల మండల కేంద్రంలోని నదిమాబాద్‌ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన పంబాల పర్వతాలు (51) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అతనికి కుమారుడు రవి, కుమార్తె స్వప్న సంతానం. రవి మద్యానికి బానిస కావడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా పర్వతాలు ఇటీవల గేదెను కొనుగోలు చేశాడు. సోమవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో రవి గేదెను తీసుకెళ్లి సంతలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతోనే మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న తండ్రి కుమారుడిని నిలదీశాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవి విచక్షణ కోల్పోయి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. వంటగదిలో ఉన్న రోకలితో తండ్రి తలపై బాదడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని కౌటాల సీఐ సాధిక్‌ పాషా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య వెంకక్క ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement