● శ్రావణమాసం చివరి సోమవారం సందడి ● దాసంగాలతో స్వామివారికి నైవేద్యాలు
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా.. కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు కాలినడకన కొండపైకి చేరుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారు సర్వాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంతో పాటు శివాలయం, అలివేలుమంగతాయారు ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో నెల రోజులుగా కొనసాగిన శ్రావణమాస వేడుకలు ముగిశాయి. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, అళహరి రామకృష్ణ, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ రూరల్


