మన్ననూరు: సమష్టి కృషితో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలోని నాలుగో యూనిట్ను పునరుద్ధరించగలిగామని కేంద్రం ఇన్చార్జి సీఈ ఆదినారాయణ పేర్కొన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈగలపెంటలోని కేంద్రం సీఈ పరిపాలన భవనం శ్రీశక్తి సదన్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగో యూనిట్ పునరుద్ధరించి గ్రిడ్కు అనుసంధానం చేశామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఆరు యూనిట్లు విజయవంతంగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయన్నారు. ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు, విధుల్లో ఉన్న ఇంజినీర్లు, అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం మన ధ్యేయం కేంద్రంలో విద్యుదుత్పత్తి విజయవంతంగా చేస్తూ రాష్ట్ర గ్రిడ్కు అన్నివేళలా విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచుతూ కొరత లేకుండా కృషి చేయాలన్నారు. అనంతరం కేంద్రం రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఆర్ఐబీ రవి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ పోలీసుల నుంచి వందనస్వీకారం చేశారు. ఎస్పీఎఫ్, ఎస్ఐలు అనూప్, శ్రావణ్ పాల్గొన్నారు.


